ఆదివారం నాడు హరిదా ఆధ్వర్యంలో మనశ్శాంతి కోవెల నవలావిష్కరణ సభ

భీంగల్ ప్రతినిధి, ఫిబ్రవరి 03 ( లోకం తీరు న్యూస్ ): బహుళ సాహితీ ప్రక్రియల్లో సాహితీ సృజన గావిస్తున్న రచయితల్ని ప్రోత్సహిస్తూ వెన్ను దన్నై నిలుస్తున్న హరిదా రచయితల సంఘం నిజామాబాద్ ఆధ్వర్యంలో సమాజసేవలో, అక్షర సేవలో సమాంతరంగా దూసుకుపోతున్న ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకుడు రచనల్లో మానవత్వాన్ని పరిమళింపజేస్తున్న డాక్టర్ మద్దుకూరి సాయిబాబు కలం నుండి జాలువారిన “మనశ్శాంతి కోవెల” సాంఘిక నవలావిష్కరణ సభ నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని హోటల్ వంశీ ఇంటర్నేషనల్ ఫస్ట్ ఫ్లోర్ లో ఆదివారం సాయంత్రం 4 గంటల నుండి ఆరంభమవుతుందని కార్యక్రమానికి ఆవిష్కర్త మరియు ముఖ్య అతిథిగా వేల్పూర్ మండలంలోని మోతె గ్రామానికి చెందిన విశ్రాంత ఐ.ఏ.ఎస్, తెలంగాణ ప్రభుత్వ పూర్వ కార్యదర్శి తొగర్ల చిరంజీవులు రానున్నారని ప్రముఖ కవి, కొరవి గోపరాజు సాహిత్య సాంస్కృతిక సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు కంకణాల రాజేశ్వర్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రముఖ భావకవి తిరుమల శ్రీనివాస్ ఆర్య స్వాగత వచనాలతో కార్యక్రమం ఆరంభం అవుతుంది. ప్రముఖ కవి, హరిదా రచయితల సంఘం జిల్లా అధ్యక్షుడు ఘనపురం దేవేందర్ సభాధ్యక్షతన కార్యక్రమం ఉంటుంది. తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ నాలేశ్వరం శంకరం సాహిత్యం- మానవత్వం అనే అంశంపై కీలక ఉపన్యాసం చేస్తారు. విశిష్ట అతిథులుగా ఇండియన్ ఆర్మీ విశ్రాంత కల్నల్ పి.వి దుర్గాప్రసాద్, తెలంగాణ హైకోర్టు సీనియర్ న్యాయవాది ఐ. గోపాల్ శర్మ పాల్గొంటారు. గౌరవ అతిథులుగా డాక్టర్ అమృతలత, డాక్టర్ ప్రతిమా రాజ్, నరాల సుధాకర్, వి. త్రివేణి డాక్టర్ కాసర్ల నరేష్ రావు, గంట్యాల ప్రసాద్ ల ఆత్మీయ వచనాలు ఉంటాయని కంకణాల వివరించారు. ఉమ్మడి జిల్లాలోని కవులు, కళాకారులు భారీ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని కంకణాల రాజేశ్వర్ కోరారు.