భీంగల్ మున్సిపల్ పోరులో…
జనసేన అభ్యర్థులకు బి-ఫామ్స్

భీంగల్ , ఫిబ్రవరి 02 ( లోకంతీరు ) : భీంగల్ స్థానిక మున్సిపల్ పోరులో జనసేన పార్టీ పునాదులు వేయనుంది.ఇప్పటికే జరగబోయే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జనసేన పార్టీ తన దూకుడు పెంచింది. భీంగల్ మున్సిపాలిటీలో జనసేన జెండాను ఎగురవేయడమే లక్ష్యంగా పార్టీ అభ్యర్థులను ఖరారు చేసి వారికి ఆదివారం నాడే అధికారికంగా ‘బి-ఫామ్స్’ అందజేసింది.బాల్కొండ నియోజకవర్గ సమన్వయకర్త భీంగల్ మండల/మున్సిపల్ సమన్వయకర్తల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో 1వ వార్డు నుండి విశ్వనాథం సుమలతకు, 4 వ వార్డు నుండి బచల్వార్ మాధవికి, 5 వ వార్డు నుండి ఆకుల సబితలకు బి ఫామ్స్ అందచేశారు. ఈ సందర్భంగా బాల్కొండ నియోజకవర్గ సమన్వయకర్త శివసారి ఫణింద్ర మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలను నమ్మి, ప్రజలకు సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ముందుకు వచ్చిన మా అభ్యర్థులకు పూర్తి మద్దతు ఉంటుందన్నారు. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న భీంగల్ మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దే బాధ్యత జనసేనదే అన్నారు. అవినీతి రహిత పాలన కోసం ప్రజలు గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి మా అభ్యర్థులను గెలిపించాలని బీoగల్ ఓటర్లను కోరారు.భీంగల్ కోఆర్డినేటర్ డాక్టర్ శ్రీకాంత్ రామావత్ అభ్యర్థులను ఉత్సాహపరుస్తూ”వార్డు కౌన్సిలర్లుగా పోటీ చేస్తున్న మహిళా అభ్యర్థులు ధైర్యంతో ముందుకు సాగాలన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకోవాలని అభ్యర్థులను కోరారు. జనసేన సైనికులుగా మనం చేసే పోరాటం భీంగల్ భవిష్యత్తును మారుస్తుందన్నారు. ఈ ఎన్నికల్లో మన విజయం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు గణేష్ తేజ, జనసేన నాయకులు బి. అర్జున్, బచావైనా దిలీప్, మహిళలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.