భారీ గణేష్ విగ్రహాల రాకపై ప్రత్యేక నిఘా
– కమ్మర్పల్లి చెక్పోస్ట్ను తనిఖీ చేసిన నిజామాబాద్ పోలీస్ కమిషనర్ ![]()
నిజామాబాద్, సెప్టెంబర్ 11 ( లోకంతీరు న్యూస్ ) : వినాయక చవితి ఉత్సవాల నేపథ్యంలో భారీ గణేష్ విగ్రహాలు నిజామాబాద్ వైపు తరలివచ్చే క్రమంలో భద్రతా చర్యల్లో భాగంగా కమ్మర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని హనుమాన్ గుడి వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక చెక్పోస్ట్ను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య తనిఖీ చేశారు.కోరుట్ల వైపు నుంచి నిజామాబాద్ వైపు తరలిస్తున్న భారీ గణేష్ విగ్రహాలకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించడం , వాహనాల రాకపోకలను పర్యవేక్షించడం , విగ్రహాల పరిమాణం , తరలింపు మార్గం , నిర్వాహకుల వివరాలు తదితర అంశాలను నమోదు చేయడం కోసం ఈ ప్రత్యేక చెక్పోస్ట్ను ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ చెక్పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి భారీ గణేష్ విగ్రహానికి సంబంధించిన వివరాలను పద్ధతిగా నమోదు చేయడంతో పాటు , విగ్రహాల తరలింపు సమయంలో ట్రాఫిక్కు ఎలాంటి అంతరాయం కలగకుండా , ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అలాగే భారీ విగ్రహాలను తరలించే వాహనాల్లో భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారా , వాహనాలకు అవసరమైన పత్రాలు ఉన్నాయా , డ్రైవర్లు నిబంధనలు పాటిస్తున్నారా అనే అంశాలను కూడా పరిశీలించాలని సిబ్బందికి సూచించారు. వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంతమైన , సురక్షితమైన వాతావరణంలో నిర్వహించేందుకు పోలీస్ శాఖ అన్ని ముందస్తు చర్యలు చేపడుతోందని , గణేష్ ఉత్సవ నిర్వాహకులు పోలీసులకు సహకరించి ట్రాఫిక్ మరియు ప్రజా భద్రతకు సంబంధించిన నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని పోలీస్ కమిషనర్ కోరారు.
