వరద ప్రభావిత గ్రామాల పరిశీలన
— ఎమ్మెల్యే మదన్ మోహన్

కామారెడ్డి ప్రతినిధి , ఆగస్టు 28 ( లోకంతీరు ) : ఎల్లారెడ్డి మండలంలోని బోగ్గుగేడేశా మరియు అన్నసాగర్ గ్రామాల్లో ఇటీవల వచ్చిన భారీ వర్షాలతో జరిగిన వరదల కారణంగా ప్రజలు తీవ్రంగా ప్రభావితమయ్యారు. ఈ నేపథ్యంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ ఈ గ్రామాలను సందర్శించి, పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించారు.ఎమ్మెల్యే వరద బాధిత కుటుంబాలతో మాట్లాడి వారి సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు మరియు నిరాశ్రయతపై అవగాహన పొందారు. ముఖ్యంగా రైతులతో మాట్లాడి పంట నష్టాలు ఎలా జరిగాయో, ఎంత మేర నష్టం వాటిల్లిందో గురించి సుదీర్ఘంగా చర్చించారు.అధికారులను కలిసి పంటనష్టం వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ విషయాన్ని రాబోయే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి, బాధితులకు తగిన న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. వరదల వల్ల నష్టపోయిన ప్రజలకు ప్రత్యేక ప్యాకేజీలు మరియు ఆర్థిక సహాయం అందేలా ప్రయత్నిస్తానని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, పార్టీ కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. అధికార యంత్రాంగానికి సరైన సూచనలు ఇస్తూ, తక్షణ సహాయం అందించేలా కూడా ఎమ్మెల్యే పలు సూచనలు చేశారు.