Take a fresh look at your lifestyle.

మూడు నెలలైనా ముందుకు సాగని కళాశాల చదువులు…

0

మూడు నెలలైనా ముందుకు సాగని కళాశాల చదువులు

– మాజీ జెడ్పిటిసి పడిగెల రాజేశ్వరరావు

కామారెడ్డి జిల్లా, ఆగస్టు 27 (లోకంతీరు ) : కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మూడు నెలలుగా మూడు సబ్జెక్టుల అధ్యాపకులు లేక ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయం విద్యార్థి తల్లిదండ్రులు సదాశివ నగర్ మండల మాజీ జెడ్పిటిసి పడిగెల రాజేశ్వరరావు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన మంగళవారం కళాశాలకు వెళ్లి విషయమై కళాశాల ప్రిన్సిపాల్ అజమల్ ఖాన్ ను ఆరా తీశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ఇంటర్ పరీక్షల సమయంలో కామర్స్, కెమిస్ట్రీ, హిందీ అధ్యాపకులు సస్పెండ్ అయ్యారని, వారి స్థానంలో మరొక అధ్యాపకులు రానందువల్ల బోధనలో ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. తమ పిల్లలకు మూడు నెలలుగా ప్రధాన సబ్జెక్టులకు సంబంధించి బోధన చేయకపోవడం వల్ల పిల్లలు ఇబ్బందులు గురి అవుతున్నారని వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయమై జూనియర్ కళాశాల జిల్లా అధికారి సలాం కి ఫోన్ ద్వారా మాజీ జెడ్పిటిసి విషయం అడగగా అధ్యాపకులు లేని మాట వాస్తవమే అన్నారు. అయితే విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతినకుండా అవసరమైతే ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులను తీసుకొని బోధించాలని సూచించారు.
అందుకు అధికారి జిల్లా విద్యాధికారి తో మాట్లాడి అలాంటి ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు. ఏది ఏమైనా ప్రభుత్వ నిర్లక్ష్యం అధికారులు అలసత్వం వల్ల విద్యార్థులు చదువుకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడిందని రాజేశ్వరరావు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బారాస మండల బీసీ నాయకుడు కలాలి సాయగౌడ్, కుప్రియాల్ గ్రామ బారాసా అధ్యక్షుడు గొలుసుల లింగం, పేరెంట్స్ కమిటి గద్దల రాములు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.