సామాజిక న్యాయం, వివక్షత కు వ్యతిరేకంగా పోరాడితేనే
“జ్యోతిబా పూలే” కు నిజమైన నివాళి

నిజామాబాద్ అర్బన్, నవంబర్ 28 ( లోకంతీరు ) : మహాత్మ జ్యోతిబా పూలే వర్ధంతి సందర్భంగా శుక్రవారం నగరంలోని సి పి ఐ జిల్లా పార్టీ కార్యాలయంలో ‘పూలే’ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శి ఎ. రమేష్ బాబు మాట్లాడుతూ, మహాత్మా జ్యోతిబా పూలే దేశంలో అప్పట్లో కొనసాగుతున్న సామాజిక వివక్షత, అంటరానితనానికి వ్యతిరేకంగా, ప్రజలను చైతన్యవంతం చేసే పోరాటం ద్వారా మాత్రమే వాటిని అరికట్టగలుగుతామనే ఉద్దేశంతో బడుగు బలహీన వర్గాలను చైతన్య వంతం చేసేందుకు అనేక ఉద్యమాలు నిర్వహించటం జరిగిందని పేర్కొన్నారు. సమాజంలో మహిళల పట్ల చులకన భావం, వివక్షత చూపుతున్న తరుణంలో వారిని చదువు చెప్పడం ద్వారా విజ్ఞానవంతులను చేయవచ్చని తద్వారా వివక్షతకు వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహించవచ్చు అని ఆలోచనతో సావిత్రిబాయిని చదివించి ఆడపిల్లలకు చదువు నేర్పించడానికి పాఠశాలలో ప్రారంభించటం జరిగిందని ఆయన గుర్తు చేశారు. అలాగే పూలే తన రచనల ద్వారా సమాజంలో బలహీన వర్గాలను చైతన్యవంతం చేయటానికి ఎనలేని కృషి చేశారని ఆయన కొనియాడారు. పూలే స్ఫూర్తితో అట్టడుగు వర్గాల ప్రజలు అనేక ఉద్యమాలు నిర్వహించారని, ఫలితంగా బలహీనవర్గాలు చైతన్యవంతం చెందుతున్నారని, నేటి పాలకులు బలహీన వర్గాలకు రిజర్వేషన్ల అమలులో తమ ఆధిపత్య ధోరణితో దాటవేస్తున్నారని అన్నారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలందరూ పోరాడినప్పుడే నిజమైన నివాళి అర్పించినట్లు అవుతుందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నూర్జహాన్, శంకర్ గౌడ్,విద్యార్థి సంఘ రాష్ట్ర నాయకుడు నాగరాజు, జిల్లా కమిటీ సభ్యులు సుజాత, విగ్నేష్, వై. గంగాధర్, నగర కమిటీ సభ్యులు అనిత, చక్రి తదితరులు పాల్గొన్నారు.