సైనసైటిస్ లక్షణాలను నిర్లక్ష్యం చేయొద్దు
– డాక్టర్ అలోక్

నిజామాబాదు / ఈఎన్టీ సర్జన్, మెడికవర్ హాస్పిటల్, జనవరి 08 ( లోకంతీరు ) : ప్రస్తుత కాలంలో వాతావరణ మార్పులు, కాలుష్యం, దుమ్ము, అలర్జీలు పెరగడం వల్ల సైనసైటిస్ సమస్య అనేక మందిని వేధిస్తున్నట్లు మెడికవర్ హాస్పిటల్స్ నిజామాబాద్కు చెందిన ఈఎన్టీ సర్జన్ డా. అలోక్ తెలిపారు.సైనసైటిస్ అనేది ముక్కులో ఉన్న సైనస్ గుహల్లో ఇన్ఫెక్షన్ లేదా వాపు ఏర్పడడం వల్ల వచ్చే వ్యాధి. దీని కారణంగా ముక్కు బ్లాక్ అవడం, ముక్కులో నుండి నీరు కారడం, తలనొప్పి, ముఖ భాగంలో నొప్పి, కళ్ల చుట్టూ వాపు, గొంతు నొప్పి, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొంతమందిలో దీర్ఘకాలంగా కొనసాగితే నిద్రలేమి, అలసట కూడా ఏర్పడుతుందని ఆయన తెలిపారు.
సైనసైటిస్కు ప్రధాన కారణాలుగా జలుబు పూర్తిగా నయంకాకపోవడం, అలర్జీలు, పొగతాగడం, ధూళి–కాలుష్యానికి ఎక్కువగా గురికావడం, రోగనిరోధక శక్తి తగ్గడం వంటి అంశాలు ఉన్నాయని వివరించారు. ప్రారంభ దశలో సరైన వైద్య చికిత్స తీసుకుంటే సైనసైటిస్ను పూర్తిగా నియంత్రించవచ్చని చెప్పారు.సైనసైటిస్ చికిత్సలో మందులతో పాటు అవసరమైతే ఆధునిక ఎండోస్కోపిక్ శస్త్రచికిత్సలు కూడా అందుబాటులో ఉన్నాయని తెలిపారు. స్వయంగా మందులు వాడటం లేదా నిర్లక్ష్యం చేయడం వల్ల సమస్య తీవ్రమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
సైనసైటిస్ నివారణకు పరిశుభ్రత పాటించడం, ధూళి ఉన్న ప్రాంతాల్లో మాస్క్ ధరించడం, చల్లని పానీయాలను తగ్గించడం, అలర్జీ కారకాలను దూరంగా ఉంచడం, జలుబు వచ్చిన వెంటనే వైద్యులను సంప్రదించడం ఎంతో అవసరమని డా. అలోక్ సూచించారు. సైనసైటిస్ సంబంధిత లక్షణాలు కనిపించిన వెంటనే అర్హత కలిగిన ఈఎన్టీ వైద్యులను సంప్రదించాలని ఆయన ప్రజలకు సూచించారు.