గంజాయి, డ్రగ్స్ ను నియంత్రించాలి
– డిచ్పల్లి ఎస్సై కి సీపీఐ (ఎం.ఎల్) మాస్ లైన్ వినతి

నిజామాబాద్ రూరల్ /డిచ్పల్లి, జనవరి 10 ( లోకంతీరు ) : డిచ్పల్లి మండలంలో గంజాయి,ఇతర మాదకద్రవ్యాలను నియంత్రించాలని డిచ్ పల్లి మండల ఎస్సై కి సీపీఐ (ఎంఎల్)మాస్ లైన్ ఆధ్వర్యంలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ డిచ్పల్లి మండల కార్యదర్శి బి. మురళి మాట్లాడుతూ, డిచ్పల్లి మండలంలో గంజాయి ఇతర మాదకద్రవ్యాలకు విద్యార్థులు, యువత అలవాటు పడుతున్నారని, ఇందుకు డ్రగ్స్ విరివిగా దొరకడమే కారణమనీ ఆవేదన వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో ముఖ్యంగా విద్యాసంస్థలు దాని చుట్టుపక్కల చిన్నచిన్న షాపుల్లో గంజాయి ఇతర మారకద్రవ్యాలు అమ్ముతూ విద్యార్థుల్ని యువతను డ్రగ్స్ కు బానిసలను చేస్తున్నారన్నారు. డ్రగ్స్ కు అలవాటు పడి విద్యార్థులు, యువత తమ విలువైన జీవితాలను కోల్పోతున్నారని , ఈ డ్రగ్స్ కు అలవాటు పడిన వారితో శాంతిభద్రతలకు కూడా పెనుముప్పు పొంచిఉన్నదన్నారు.డ్రగ్స్, గంజాయికి పలు షాపులు అడ్డాలుగా మారాయన్నారు. ఈ డ్రగ్స్ మత్తులో గొడవలు పడుతున్నారని, హత్యలు, అత్యాచారాలు చేయడానికి కూడా వెనుకాడడం లేదన్నారు. ముఖ్యంగా తల్లితండ్రులు కూడా డ్రగ్స్ గంజాయి ఇతర మత్తుపార్థాల అరికట్టడంలో పాత్ర పోషించాల్సిందిగా కోరారు.రైల్వే స్టేషన్, బస్ స్టేషన్ పరిసర ప్రాంతాలు, మారుమూల శివారు ప్రాంతాల్లో గంజాయి డ్రగ్స్ విరివిగా లభ్యమవుతూ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గంజాయి డ్రగ్స్ ఇతర మాదకద్రవ్యాలను నియంత్రించేలా చర్యలు తీసుకోవాలని, విద్యాసంస్థల దాని చుట్టూ పరిసర ప్రాంతాల్లో నిఘా చేపట్టాలని కోరారు. గంజాయి డ్రగ్స్ అమ్ముతున్న పాత్రధారులను, సూత్రధారులను అరెస్టు చేసి, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో PDSU జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కర్క గణేష్, PYL నిజామాబాద్ డివిజన్ అధ్యక్షులు సాయిబాబా, ఉపాధ్యక్షులు మోహన్, PDSU నాయకులు శ్రీరాము, రాజేష్,బన్నీ తదితరులు పాల్గొన్నారు.