Take a fresh look at your lifestyle.

నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను సందర్శించిన కలెక్టర్ …..

0

నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను సందర్శించిన కలెక్టర్ 

నిజామాబాద్, జనవరి 30 ( లోకంతీరు )  : మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల దాఖలు ప్రక్రియ చివరి రోజైన శుక్రవారం నాడు కలెక్టర్ ఇలా త్రిపాఠి విస్తృతంగా పర్యటిస్తూ, నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను క్షేత్రస్థాయిలో సందర్శించారు. బోధన్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన నామినేషన్ల స్వీకరణ తీరును పరిశీలించి, అధికారులకు సూచనలు చేశారు. అదేవిధంగా నిజామాబాద్ నగరంలోని బడా బజార్ వాటర్ ట్యాంక్ మున్సిపల్ జోన్ ఆఫీసును సందర్శించి నామపత్రాల స్వీకరణ ప్రక్రియను నిశితంగా పరిశీలించారు. చివరి రోజున సాయంత్రం 5.00 గంటల లోపు వచ్చిన వారికి నామినేషన్లు దాఖలు చేసేందుకు అవకాశం కల్పిస్తున్నారా అని గమనించారు. నామినేషన్లు అందించేందుకు స్వీకరణ కేంద్రం ఆవరణలో నిరీక్షిస్తున్న వారికి అందుబాటులో ఉంచిన సదుపాయాలను పరిశీలించి, తాగునీరు వంటి వసతులు సమకూర్చాలని అధికారులను ఆదేశించారు. హెల్ప్ డెస్క్, వీడియోగ్రఫీ, పోలీస్ బందోబస్తు తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ, సపోర్టింగ్ స్టాఫ్ సరిపడా ఉన్నారా అని ఆరా తీశారు. నోటీసు బోర్డులపై నోటిఫికేషన్ పత్రాలను ప్రదర్శించారా అని తనిఖీ చేశారు. ఎలాంటి పొరపాట్లు జరగకుండా నామినేషన్ల ప్రక్రియను నిర్వహించాలని, నామినేషన్ దరఖాస్తు ఫారాలు సమర్పించిన వారి వివరాలను పక్కాగా రిజిస్టర్ లో నమోదు చేయాలని కలెక్టర్ సూచించారు. దాఖలైన నామినేషన్లకు సంబంధించిన అఫిడవిట్ లను నోటీసు బోర్డులపై ప్రదర్శిస్తూ, సకాలంలో రిపోర్టులు పంపించాలని అన్నారు.  నామపత్రాలు దాఖలు చేసే విషయంలో అభ్యర్థులకు అవసరమైన సహకారం అందించాలని సూచించారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను తు.చ తప్పకుండా పాటిస్తూ, ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియను నిర్వహించాలని అన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి పక్కాగా అమలయ్యేలా చూడాలన్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా, పై అధికారులను సంప్రదించాలని సూచించారు. కలెక్టర్ వెంట బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, ఇతర అధికారులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.